Smart Citizen

SMART CITIZEN

(Socially Motivated And Rationally Trained Citizen)


You are born as an individual
Now grow into a Person

For an individual loves himself
A Person loves his family


Don't remain only a Person
But grow into a Citizen
For a Citizen loves his Country


Don't remain only a Citizen
But be an enlightened Citizen
For an Enlightened Citizen Serves his Country

- Swamy Srikantananda
Courtesy- Power of Mind
- Ramakrishna Math, Hyderabad


మొదటి మాట!

ప్రతి పని ఈ మూడు దశలను దాటాలి -
అవహేళన, వ్యతిరేకత, తరువాత ఆమోదం.

ఇంకా స్వామీ వివేకానందులవారు చెప్పినట్లు, ఇతరుల ఆలోచనా విధానం, కార్య నిర్వహణల్లోని తప్పుల్ని ఎత్తి చూపేబదులు, వాటిలో పరిణితి (నైపుణ్యం) సాధించే మార్గాలను వారికి తెలియచేస్తే, సత్పలితాలను సాధించవచ్చు.


రెండో మాట!!

ఒకటి రెండు గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన పది మంది ఇరవై మంది కార్యకర్తల సంకల్పం చాలు - ఎన్నటికీ నాశనం కానీ బీజంగా ఏర్పడతాయి. వీటి నుంచే కాల క్రమేణా వేలకు వేల మంది సంకల్పం పొంది లక్షలాది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తారు. ఈ దిశలో మన సమాజ శ్రేయస్సు కొరకు ఎంతోమంది ఎంతో చేయాలని ఎన్నో వసంతాలుగా సాధన చేస్తున్నారు - సాధిస్తున్నారు. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో వుంది.


మూడో మాట!!!

దక్షిణాఫ్రికా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఈ క్రింది సందేశం ఉంచబడిందని అంటారు.


"ఏదైనా దేశాన్ని నాశనం చేయడానికి అణు బాంబులు
లేదా సుదూర క్షిపణుల ఉపయోగం అవసరం లేదు.
కేవలం ఆ దేశములో విద్య నాణ్యతను తగ్గిస్తే చాలు."


ఈ తరం పిల్లల నుండి తల్లిదండ్రులు; తల్లితండ్రుల నుండి సమాజం - ఆశించేది


SMART CITIZENS
(Socially Motivated And Rationally Trained Citizens)



మాతృదేవోభవ!
పితృదేవోభవ!
ఆచార్యదేవోభవ!
అతిథిదేవోభవ!
సర్వేజనా సుఖినోభవంతు!

అందరూ సుఖముగా వుండాలి! తల్లీ తండ్రీ, చదువు చెప్పిన గురువూ, ఇంటికొచ్చిన అతిథీ కూడా దైవంతో సమానమే అని బోధిస్తుంది సనాతన భారతీయ ధర్మం. అంటే ముందుగా తల్లిదండ్రులు తర్వాత గురువు. నాల్గవ పూజ్యనీయ స్థానం అతిథిదే.


ఎవరైతే ఈ సూక్తులను సరిగ్గా అర్థం చేసికొని, ఆచరిస్తూ వారి భవిష్యతను నిర్ధేశించుకుంటారో వారు అత్యంత ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా ఆనందంగా ఉంచుతారు.


అయితే చిన్నారులు ఈ విషయాలను వారంతట వారు తెలుసుకోగలరా? మరి ఎవరు చెప్పాలి? ఎవరు నేర్పాలి? ముందుగా తల్లితండ్రులు, తర్వాత గురువులు. కానీ ప్రస్తుత సమాజములో ఏమి జరుగుతున్నది?


మన పిల్లలను రెండు సంవత్సరాల వయసులో ప్లే స్కూల్లో, మూడు సంవత్సరాల వయసులో నర్సరీ స్కూల్లో, ఆ తర్వాత కాన్వెంట్లోనో లేదా ఊటీ లేదా టెక్నో కాన్సెప్ట్ స్కూల్స్ లోనో వేసేస్తున్నాము. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయత అనే పదాలకు అర్థం తెలియకుండా పెంచుతున్నాము. మొక్కగా వున్నపుడు వంచలేకపోతే మానైన తర్వాత వంచగలమా?


మార్కులు చూస్తున్నామే తప్ప, వారిలో వచ్చే పెనుమార్పులు గమనించలేకపోతున్నాము. మనము తెలుసుకొనేటప్పటికీ - చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు - అనే సామెతను నిజం చేసుకొంటూ శోకంతో మిగిలిపోతున్నాము.


ఈ ఇంటర్నెట్ యుగంలో, మన మరియు మన చిన్నారుల చేతుల లోనికి ఎప్పుడైతే మొబైల్ ఫోనులు వచ్చాయో, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అనే సూక్తులు అదృశ్యమైపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


ప్రస్తుత సమాజములో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే, "పితృదేవోభవ" అనే సూక్తి కూడా "స్వేచ్ఛ" అనే హక్కులో కొట్టుకుపోతున్నట్లు అనిపిస్తోంది.


ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు "మాతృదేవోభవ" అంటే కూడా ఏమిటో తెలియకుండాపోయి, మన భవిష్యతరాల వాళ్లు ఎలా తయారవుతారో ఊహించుకుంటేనే వెన్నులో చలివేస్తుంది.


పాఠశాలలలో, కళాశాలలో క్రీడా మైదానాలు వుండటము లేదు. చదువులో చలాకీ తనం ఉండటం లేదు. పది సంవత్సరాలు దాటిన వయస్సు నుంచే పిల్లలలో ధ్వేషం, కోపం, పగ ప్రతీకారాలు, తనకు దక్కంది ఎవరికీ దక్కకుడదన్న ఆకోశ్రం, లైంగిక వాంఛ వంటివి వచ్చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత దేశం లో ఎందుకిలా జరుగుతుందని........ తప్పు ఎవరిదని....... మనలో మనం ప్రశ్నించుకొంటే చాలు - అర్థమవుతుంది!


తమ కాళ్ళపై తాము నిలబడవలసిన బాలలకు వారిపై వారికి నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని, తమ కుటుంబంపట్ల ప్రేమ, తమపట్ల తమకు ఒక విధమైన బాధ్యత, సమాజంపట్ల సరైన స్పందన, ఇతరులపట్ల జాలి, దయ, కరుణ, ఇలా మానవత్వపు విలువలు నేర్పించే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు విద్యనూ మనం అందిస్తున్నామా? దారితప్పుతున్న చిన్నారులను అక్కున చేర్చుకొని ఇది మంచి .. ఇది చెడు.. అని చెప్పాల్సిన బాధ్యత మనది కాదా?


చిన్నారులను పట్టించుకోకుండా, సంపాదనే పరమాత్మ అనుకుంటే …… భవిష్యత్తులో మన పిల్లలే మన తలరాతలు మార్చేస్తారు. సభ్య సమాజం సిగ్గుపడే పనులు చేసి జీవితాన్ని అంధకారంలో నెట్టేసుకుంటారు. ఎవరికోసమైతే మనం కష్టపడుతున్నామో, వారే మన చేతికి అందకుండపోతారు. అప్పుడు ఈ డబ్బు…… హోదాలు ఎందుకూ పనికిరాకుండాపోతాయి.


ఇప్పుటికైనా మేల్కోవాలి. మన పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి సరైన మార్గం చూపించాలి.


ఉపాధ్యాయులు కూడా కేవలం పాఠ్యాంశాలే కాకుండా పిల్లల్లో వస్తున్న మానసిక ప్రవర్తినను గమనిస్తూ, సమయం దొరికినప్పుడే మంచి చెడు దారుల గురించి వివరిస్తుండాలి. దేశానికి సేవ చేసిన మహనీయుల జీవిత చరిత్రలు, విజయగాధలు వివరిస్తుండాలి. భారతీయ ఔనత్యాన్ని చాటిచెప్పే విధంగా కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ మరియు సర్వేజనా సుఖినోభవంతు అన్న సూక్తులలోని పరమార్థాన్ని తెలియజేయాలి.


ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా అధ్యాపకులు, ఆచార్యులు ఎటువంటి భయాందోళనలకు లోనుకాకుండా పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్య నేర్పే వాతావరణము కల్పించాలి అనేది మా అభిప్రాయం. దానికి అనుగుణముగా అవసరమైన చట్టాలను తేవాలి. పూర్వకాలములో అధ్యాపకులు, ఆచార్యులు విద్యార్థులను మందలించినా, కోప్పడినా తల్లి తండ్రులు సమర్ధించేవారు. ఈ తరం తల్లి తండ్రులు - ఆలోచించండి...


ప్రతిపాదన


1. పై విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, అందరి సహాయ సహకారములతో, భారతీయ సంస్కృతి, నైతిక విలువలు మరియు చదివే చదువుకు సంబంధించిన వృత్తి నైపుణ్యంతో కూడిన సంపూర్ణమైన విద్యను ఈ తరంకు చెందిన బాలబాలికలకు బాల్యంనుండే సమకూర్చి, తద్వారా భవిష్య తరాలకు సామాజిక ప్రేరణ మరియు హేతుబద్దంగా శిక్షణ పొందిన పౌరులను (SMART CITIZENS) అందించుటకుగాను భోజన, వసతి గృహములతో కూడిన చారిటబుల్ విద్యాలయాలను (SMART CITIZEN CHARITABLE SCHOOLS) స్థాపించుట.


2. ముందుగా ప్రతి గ్రామము నుండి 9 సంవత్సరముల వయస్సు గలిగి, 4వ తరగతి చదివిన ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులను, ప్రతి సంవత్సరము, ఒక్కో విద్యాలయమునకు, 120 మంది వరకు తీసుకొని వారు 5వ తరగతి నుండి డిగ్రీ విద్య పూర్తి చేసేవరకు భారతీయ సంస్కృతి, నైతిక విలువలతో కూడిన సంపూర్ణ విద్యాభాసం కల్పించి, పూర్తి మానవత్వముతో కూడిన విద్యావంతులైన పౌరులుగా తీర్చిదిద్ది, తిరిగి వారి గ్రామాలలోనే వారికి జీవనోపాధి కల్పించి, వారి ఒక్కొక్కరిద్వారా అటువంటి మరో 120 మంది పౌరులను తీర్చిదిద్దించుట.


3. ప్రతిఫలంగా అటువంటి పిల్లల తల్లి తండ్రుల నుండి ఆశించేది - ప్రతీ విద్యార్థి తల్లి తండ్రులు లేదా సంరక్షకులు స్వచ్ఛందంగా సంవత్సరములో కనీసం ఒకటి నుండి రెండు వారములు (వారి వీలునుబట్టి సంవత్సరములో ఏ వారములు అన్నది ముందే నిర్ణయించబడుతుంది), వారి పిల్లలు చదివే విద్యాలయములో, వారితో పాటూ ఉంటూ, అందరి విద్యార్థులను వారి పిల్లలుగానే భావించి, వారి బాగోగులను పర్యవేక్షిస్తూ, పిల్లలు తమ తల్లి తండ్రులతోనే ఉన్నామన్న అనుభూతి చెందే విధముగా చూసుకోవాలి.


Top


Go to Home